సెలవుల సంస్కృతిపై ఓ హైదరాబాద్ కంపెనీ సీఈవో వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు

  • ఏప్రిల్‌లో పదికి పైగా సెలవులు వచ్చాయన్న ఓ హైదరాబాద్‌‌కు చెందిన కంపెనీ సీఈవో
  • భారత్‌లో సెలవుల సంస్కృతిపై పునరాలోచన చేసి చర్యలు తీసుకోవాలని వినతి 
  • సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ 
  • ఆయన అభిప్రాయాలను విభేదిస్తూ నెటిజన్ల పోస్టులు
దేశంలో పని గంటలపై చర్చ జరుగుతున్న వేళ, హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ లేవనెత్తిన అంశం కొత్త చర్చకు తెరలేపింది. అధిక సెలవుల వల్ల పనులు ముందుకు సాగడం లేదని, ఏప్రిల్ నెలలో పదికి పైగా సెలవులు వచ్చాయని, దీని కారణంగా కార్యాలయాల్లో రికార్డులు పెండింగ్‌లో పడుతున్నాయని క్లీన్ రూమ్స్ కంటైన్ మెంట్ సీఈవో రవికుమార్ తుమ్మలచర్ల తన లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. చైనాతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, దేశంలో సెలవుల సంస్కృతిపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి.

వారాంతపు సెలవులు, ప్రభుత్వ సెలవులు, ఇతర సెలవుల వల్ల పనులకు ఆటంకం కలుగుతోందని, చాలా కార్యాలయాల్లో వారాల తరబడి ఫైళ్లు ముందుకు కదలడం లేదని ఆయన అన్నారు. చైనా మనకన్నా 60 ఏళ్లు ముందుందని, అక్కడ ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారని ఆయన పేర్కొన్నారు. సెలవుల సంస్కృతిపై పునఃపరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రవికుమార్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన అభిప్రాయంతో విభేదిస్తూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.

"మనం యంత్రాలమా? భారత సంప్రదాయాలు, సంస్కృతి గొప్పతనం మీకు తెలుసా?" అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, ఎక్కువ సెలవుల గురించి ఒకరు ఫిర్యాదు చేయడం తాను ఎప్పుడూ చూడలేదని మరొకరు వ్యాఖ్యానించారు. భారత్, చైనా సామాజిక, రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రెండింటినీ పోల్చడం సరికాదని మరొకరు అభిప్రాయపడ్డారు. ఈ విధంగా రవికుమార్ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 

Ravi Kumar Tummalacherla
Clean Rooms Containment CEO
Holiday Culture in India
Work-life balance debate
Prime Minister Narendra

More Telugu News